పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 25 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీడీ లోకేశ్వర్, టెక్నికల్ అసిస్టెంట్ గిడ్డయ్య మంగళవారం సమగ్రంగా పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి, కార్మికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని, అక్కడ పనిచేస్తున్న వేతనదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు పనులు సమయానికి పూర్తి కావాలని, నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. కూలీలకు వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న ‘వీబీజీ రామ్ జీ’ పథకంపై గ్రామస్థులకు, ముఖ్యంగా ఉపాధి హామీ కార్మికులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ నితిన్ కుమార్ సూచించారు. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రతి కార్మికుడికి స్పష్టంగా వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగరాజు పాల్గొని, గ్రామంలో జరుగుతున్న పనులపై అధికారులకు వివరాలు అందించారు.