పయనించే సూర్యడు మార్చి 28 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మండల పరిధిలోని రత్నవరం గ్రామంలో హరిహర క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కీసర కుటుంబ సభ్యుల ప్రత్యేక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయంలో సీతారాముల స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వేడుకగా జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై మంగళహారతులతో భక్తి భావాన్ని చాటుకున్నారు. చిన్నపిల్లల కోలాహలంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ కీసర కుటుంబ సభ్యులు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకతో రత్నవరం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.