పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సు నూతనంగా మంజూరు చేయబడిందని కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ తెలిపారు. డిగ్రీ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మొదటిసారిగా ప్రారంభం కావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన బైపీసీ విద్యార్థులు, ఇంటర్ స్థాయిలో ఎంఎల్టీ పూర్తి చేసిన విద్యార్థులు, అలాగే కస్తూర్బా గాంధీ కళాశాలలో సంబంధిత కోర్సు పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో డిగ్రీ స్థాయిలో ఎంఎల్టీ కోర్సు అందుబాటులో లేకపోవడంతో, ఈ కొత్త కోర్సు వారికి మంచి అవకాశంగా మారుతుందని అన్నారు. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైందని, విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసిన వారు DOST వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఇక కళాశాలలో బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులతో పాటు MPC, MPCS కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ మదన్ మోహన్ కోరారు.