మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక విప్లవ శిఖరం: జహీరాబాద్‌లో ఘనంగా 199వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) భారతదేశ సామాజిక చరిత్రలో అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, స్త్రీ విద్యకు ఆద్యుడిగా, సమసమాజ స్థాపన కోసం పోరాడిన ధీశాలి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వర్ణ వ్యవస్థ, అంటరానితనం మరియు స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన తొలితరం సామాజిక విప్లవకారుడు పూలే అని వక్తలు కొనియాడారు. అక్షరమే ఆయుధంగా పూలే పోరాటం “విద్య లేకపోతే మతి తప్పుతుంది, మతి లేకపోతే నీతి తప్పుతుంది, నీతి లేకపోతే గతి తప్పుతుంది” అని బలంగా నమ్మిన పూలే, 1848లో పూణేలో బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను స్థాపించారని పేర్కొన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలేను దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది, ఎన్ని అవమానాలు ఎదురైనా పేదలు, దళితులు మరియు మహిళలకు విద్యను చేరువ చేశారని స్మరించుకున్నారు. సత్యశోధక్ సమాజ్ – సామాజిక మార్పు 1873లో స్థాపించిన ‘సత్యశోధక్ సమాజ్’ ద్వారా మానవులందరూ సమానమని చాటడమే కాకుండా, పురోహిత వ్యవస్థ లేని సమాజాన్ని నిర్మించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు. ఆయన రాసిన ‘గులాంగిరి’ పుస్తకం సామాజిక బానిసత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రమని చర్చించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, అంటరానితనాన్ని నిరసిస్తూ తన ఇంటి మంచినీళ్ల బావిని దళితుల కోసం తెరిచిన మానవతావాది పూలే అని వక్తలు గుర్తు చేశారు. రాజ్యాంగ సమానత్వానికి పునాది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పూలేను తన గురువుగా భావించేవారని, పూలే ఆశయాలే మన రాజ్యాంగంలోని సమానత్వానికి పునాదులని వివరించారు. నేటి మహిళా సాధికారతకు ఆయన వేసిన బాటలే కారణమని, ఆయన ఆశయాల బాటలో నడుస్తూ వివక్ష లేని నవ సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుగ్గేల్లి రాములు, డా.పెద్దగొల్ల నారాయణ, రాములు నేత, కొండపురం నర్సిములు, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సాగర్, నరేష్ పాటిల్, శేఖర్ వడ్డే, జైపాల్, చెన్నబసవ, శభాష్, రమేష్ బాబు, మాదినం శివ ప్రసాద్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *