పయనించే సూర్యుడు చోడవరం అనకాపల్లి జిల్లా (వి.మాడుగుల), ఏప్రిల్ 12: గంజాయి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటంలో భాగంగా, అనకాపల్లి జిల్లా పోలీసులు సాక్ష్యాధారాలతో సహా పకడ్బందీగా నమోదు చేసిన కేసులో నిందితులకు శిక్ష పడింది. వి.మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన భారీ గంజాయి అక్రమ రవాణా కేసులో నేడు చోడవరం లోని 9వ అదనపు జిల్లా కోర్టు గౌరవ జడ్జి ఎం.హరి నారాయణ సంచలన తీర్పు వెల్లడించారు. కేసు వివరాలు 10 జనవరి 2015న, వి.మాడుగుల మండలం గరికబంద చెక్ పోస్ట్ వద్ద అప్పటి సబ్-ఇన్ స్పెక్టర్ జి.తేజేశ్వరరావు మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పాడేరు నుండి వస్తున్న ఒక టాటా సుమో (ఏపీ 9 ఏ ఎచ్ 8169) వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 140 కిలోల గంజాయిని గుర్తించారు. పోలీసులు వాహనాన్ని, గంజాయిని మరియు నిందితులను అదుపులోకి తీసుకునిఎన్ డి పి ఎచ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. శిక్ష పడిన నిందితులు: ఏ 1 – పానుగంటి సుబ్బారావు (కడప జిల్లా) ఏ 2 – అల్లు సత్యనారాయణ (విశాఖపట్నం) ఏ 3 – అడిగర్ల సత్తిబాబు (రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా)
ప్రాసెక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాస్క్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణ బలమైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నేరం నిరూపితం కావడంతో, గౌరవ న్యాయమూర్తి నిందితులకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
నేరస్థులకు శిక్ష పడేలా సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాస్క్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణను, కేసును శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేసిన నాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై జి.తేజేశ్వరరావును, మరియు వి.మాడుగుల పోలీస్ సిబ్బందిని, కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ”మత్తు పదార్థాల రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, ఈ తీర్పు అక్రమ వ్యాపారాలు చేసేవారికి ఒక హెచ్చరిక” అని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం, అనకాపల్లి జిల్లా.