
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ఏపీ టి పి సి చైర్మన్ వజ్జ బాబూరావు ఖండించారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని సోషల్ మీడియాలో మరియు కొన్ని వార్తా పత్రికల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆయన ఖండించారు. ఆర్ఓబి పనులలో పిల్లర్లు తొలగించడానికి కారణము ఆయన వివరించారు. అక్కడ రెండు పిల్లర్ల మధ్య ఎత్తులో తేడా రావడంతో, సుమారు 80 సెంటీమీటర్ల ఎత్తు పెంచేందుకు రైల్వే మరియు ఆర్ అండ్ బి అధికారుల సూచన మేరకు వాటిని రీవర్క్ చేయడం జరిగిందని బాబూరావు తెలిపారు. నిర్మాణములు పూర్తి నాణ్యతలను పాటిస్తున్నామని ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడలేదని స్పష్టం చేశారు. స్థానిక ఇంజనీర్లు మరియు కాంట్రాక్టర్ల అభిప్రాయం తీసుకున్న తర్వాతే పనులు జరుగుతున్నాయని తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టు కోసం సుమారు 44 కోట్ల రూపాయల నిధులను సమకూర్చారని, ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. మీడియా తెలుసుకోకుండా కొన్ని వార్తలను ప్రచురించడం వలన ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుందని, పాత్రికేయులంతా తమకు సహకరించాలని ఆయన కోరారు.మొత్తంగా, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సజావుగానే జరుగుతున్నాయని, చిన్న సాంకేతిక మార్పుల కోసం చేసిన పనులను లోపాలుగా చిత్రీకరించవద్దని బాబూరావు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.